
మేలైన యాజమాన్య పద్ధతులు
వరి వంగడాల ఎంపిక: వివిధ ప్రాంతాలకు అనువైన వరివంగడాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన ఎంపికలోనే దిగుబడి ఆధారపడి ఉంటుంది. మంచి విత్తనం ఎంపికతో రైతుకు మేలు చేకూరుతుంది.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బండిజిమ్ను కలిపి 24 గంటలు తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దంపనారు అయితే లీటర్ నీటికి ఒక గ్రాము కార్బండిజిమ్ కల్పి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి మొలకలను దంపనారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టటానికి లీటర్ మందు నీరు సరిపోతుంది.
విత్తన మోతాదు: నాటే పద్ధతికి 20 నుంచి 25కిలోలు, వెదజల్లటానికి (భూముల్లో) 24 నుండి 30కిలోలు, వెదజల్లటానికి గోదావరి జిల్లాలో 10 నుండి 12 కిలోలు గొర్రుతో విత్తటానికి (వర్షాధారపు వరి) 30 నుంచి 36 కిలోలు అవసరం ఉంటుంది. శ్రీ పద్ధతిలో అయితే ఎకరానికి రెండు కిలోల విత్తనాలు సరిపోతాయి.
ఆరోగ్యవంతంగా నారు పెంచటం ఇలా
- నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో మూడు దఫాలు దమ్ముచేసి చదును చేయాలి. నీరుపెట్టటానికి, తీయటానికి వీలుగా కాల్వలు ఏర్పాటు చేయాలి.
- 5 సెంట్ల నారుమడికి రెండుకిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, కిలో పొటాష్నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో భాస్వరం రెట్టింపు చేయాలి.
- మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి.
- నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు ఆరుతడులు ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిల్వ కట్టాలి.
- జింకు లోపాన్ని గమనిస్తే లీటర్ నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీచేయాలి. చలి ఎక్కువగా ఉండే దాళ్వా వరిసాగులో జింకు లోపం లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
- విత్తిన 10 రోజులకు కార్బోప్యూరాన్ 3జి గుళికలను సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీ లీటర్లు లేద క్లోరోపైరిఫాస్ 2మిల్లిలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన 10రోజులకు, 17 రోజులకు పిచికారీ చేయాలి. లేదంటే నారుతీయటానికి ఏడు రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరుంచి వేయాలి.
Credits : Andhrajyothi